Pages

Tuesday, May 24, 2011

రైతు గోడు పట్టని సర్కారొద్దు

విజయనగరం జిల్లా ఓదార్పులో వైఎస్ జగన్ ఉద్ఘాటన
చంద్రబాబూ.. అసమర్థ ప్రభుత్వమంటావేగానీ.. అవిశ్వాసం పెట్టవేం?
నాడు 46 మంది ఎమ్మెల్యేల బలంతోనే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టావు...
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా అవిశ్వాసం పెట్టనంటున్నావు
వైఎస్సార్ చనిపోయిన తరువాత రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే నేతలు కరువయ్యారు
టీడీపీ, కాంగ్రెస్‌ల కంటికి ప్రజల సమస్యలు కనిపించడం లేదు.. ఒక్క జగనే కనిపిస్తున్నాడు
రాష్ట్ర ప్రజల మనోగతాన్ని కడప తీర్పు చాటి చెప్పింది
మాట ఇస్తే మడమ తిప్పని నేతనే జనం కోరుకుంటున్నారు 

భోగాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: పేదోడి సంక్షేమం పట్టని, రైతుకు వెన్నుదన్నుగా నిలువని ఈ కాంగ్రెస్ సర్కారు ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రతి రైతు, పేదవాడూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ.. ఇది అసమర్థ ప్రభుత్వం అంటున్నారని, ఆయన మాటల్లో నిజాయితీ ఉంటే ఆ ప్రభుత్వంపై ఆయన ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ప్రశ్నించా రు. విజయనగరం జిల్లాలో మంగళవారం ప్రారంభమైన మలి విడత ఓదార్పు యాత్ర భోగాపురం మండంలోని పలు గ్రామాల్లో సాగింది. రావాడ గ్రామంలో ఇప్పిలి సన్యాసి కుటుంబాన్ని ఓదార్చిన జగన్ భోగాపురం మండల కేంద్రంలో జరి గిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ర్టంలో జరుగబోయే రాజకీయ మార్పులకు కడప ఎన్నికలు నాంది పలికాయని అన్నారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాష్ట్ర ప్రజల ఆకాంక్షే కడప తీర్పు: ‘‘45 రోజుల కిందట ఓదార్పులో ఉండగా కడప ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో యాత్రను మధ్యలోనే ఆపేసి వెళ్లాను. ఆనాడు మీరు ఎంత ప్రేమ, ఆప్యాయతలతో దీవించి నన్ను యుద్ధానికి పంపారో నేను మరిచిపోలేదు. అదే ప్రేమ, ఆప్యాయతల ను మళ్లీ నా మీద చూపిస్తున్నారు. మీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఎన్నికల వేళ అప్పటికప్పుడు మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకునే నేతలను కడప ప్రజలు ఇంటికి సాగనంపారు. ఏ నాయకుడైతే కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడతాడో.. అతడే తమ నాయకుడని కడప ప్రజలు తీర్పు చెప్పారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల మనోగతాన్ని చాటిచెప్పింది. ప్రజల ఆకాంక్షను బయట పెట్టింది. యావత్ రాష్ట్రం కూడా మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడినే కోరుకుంటోంది. రాష్ర్ట ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కడప ప్రజలు తీర్పు చెప్పారు.

పేదల గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత పేదల గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు. ప్రతిపక్షం, పాలక పక్షం పేదల బాగోగులను పట్టించుకోవడం ఏనాడో మరిచిపోయింది. ఈ చేతగాని ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. చంద్రబాబు కూడా అప్పుడప్పుడు రోడ్డు మీదకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ ఇది అసమర్థ ప్రభుత్వం అని అంటున్నారు. నేను అడుగుతున్నా.. చంద్రబాబు గారూ.. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచుతున్నారు? అసమర్థ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు. నాడు 46 మంది ఎమ్మెల్యేల బలంతోనే.. అవిశ్వాసం పెట్టావు. ఇప్పుడు నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అవిశ్వాసం పెట్టనుగాక పెట్టనంటున్నావు. రైతు సోదరులు ఈ ప్రభుత్వం పోవాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రజలపై కపట ప్రేమతో మొసలి కన్నీళ్లు కార్చడం కాదు.. నీ మాటల్లో నిజాయితీ ఉంటే అవిశ్వాసం పెట్టు. ప్రజా సమస్యలను గాలికి వదిలి చంద్రబాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయి. ఇప్పుడు వారి కళ్లకు పేద ప్రజలు కనిపించడం లేదు. ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.’’

ఏ అవసరమొచ్చినా నేనున్నా..

సన్యాసి కుటుంబానికి జగన్ భరోసా

‘మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నా’నంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పిలి సన్యాసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన సన్యాసి 2009లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఆయన ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ఆ ఇంట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, సన్యాసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పేర్లను అడిగి, వారిని ఆప్యాయంగా పలకరించారు. సన్యాసి భార్య నారాయణమ్మ, కుమారులు సన్యాసిరావు, ఎర్రయ్య, కుమార్తె నర్సయ్యమ్మ, కోడలు రమణమ్మలను ఓదార్చారు. తల్లి నారాయణమ్మను చక్కగా చూసుకోవాలని వారికి సూచించారు. మీకేకష్టం వచ్చినా ఆదుకోవడానికి నేనున్నానని ధైర్యం చెప్పారు. నారాయణమ్మ జగన్‌కు పరమాన్నం తినిపించారు.

No comments:

Post a Comment