Pages

Sunday, May 29, 2011

వైఎస్ యుగంలో రైతుకు భరోసా ఉండేది

ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్య

రైతుకు.. మద్దతు ధర వస్తుందన్న విశ్వాసం ఉండేది
వైఎస్ పాలనలో విద్యార్థికి.. చదువు పూర్తిచేస్తాననే నమ్మకముండేది
తల్లిదండ్రులకు.. తమ పిల్లలు పెద్ద చదువులు చదివి
తమను పోషిస్తారనే ధీమా ఉండేది
వైఎస్ చనిపోయాక ఒక్కనేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు
ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు
మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు

బలిజపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: జనహృదయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగంలో ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు, ప్రతి అక్కా ప్రతి చెల్లెకూ భవిష్యత్తుపై భరోసా ఉండేదని, నేడు రాష్ట్రంలో ఆ భరోసా లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ సువర్ణ యుగంలో రైతులకు ఓ భరోసా ఉండేది. పండించిన పంటకు గిట్టుబాటు వస్తుంది.. మద్దతు ధర కంటే రెండు వందల ఎక్కువరేటు వస్తుందన్న భరోసా ఉండేది.. ఈవాళ కాకపోయినా మరో ఆరు నెలలకైనా ప్రాజెక్టులు పూర్తయి నా పొలంలోకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఎకరా రూ. 30, రూ. 40 వేలు ఉన్న పొలం రెండు, మూడు లక్షల రూపాయల రేటు పలుకుతుందనే భరోసా ఉండేది. ప్రతి విద్యార్థికీ తాను తన చదువు పూర్తిచేస్తానన్న నమ్మకం ఉండేది. తల్లిదండ్రులకు తమ కుమారుడు మరో నాలుగేళ్లలో తన విద్యను పూర్తిచేసి ఇంజనీరింగో, డాక్టరో చదివి లేదంటే.. చివరకు ఫ్యానుకింద కూర్చొనే ఉద్యోగమైనా చేసి వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడనే ధీమా ఉండేది. కారణం ఏమిటంటే దివంగత మహానేత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడనే భరోసా వారికుండేది. ఆయన మరణించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఈవాళ ఏ ఒక్క నేత కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజు బొబ్బిలి, బలిజపేట, సీతానగరం మండలాల్లోని గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. బలిజపేట, సీతానగరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైఎస్సార్ బతికున్న రోజుల్లో రైతుల ముఖాల్లో చిరునవ్వులు పండేవని, ఇప్పుడు రైతు ప్రతి రోజూ ఆకాశంవైపు చూస్తూ వైఎస్సార్‌ను మళ్లీ బతికించు దేవా అని వేడుకుంటున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

మన ఖర్మకొద్దీ చంద్రబాబు..

‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వం అనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుంటారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నారు.. అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబూ.. అంటే పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ప్రజా డిమాండ్లు తీర్చకపోతే అవిశ్వాసం పెడతామనండి..

చంద్రబాబునాయుడు గారూ.. గత 18 నెలల కాలంగా రైతు సోదరులు ఆరుసార్లు దెబ్బ మీద దెబ్బ తిన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రావాలంటే రూ. 2000 కోట్లు అవసరం. మీరు వారంరోజుల గడువిచ్చి ఆరూ. 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేయండి. లేదంటే అవిశ్వాసం పెడతానని బెదిరించండి. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద ప్రభుత్వం గతేడాది రూ. 3400 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది మరో రూ. 3400 కోట్లు కావాలి. మొత్తానికి రూ. 6800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

అవిశ్వాసం పెడతామని.. ఆ 6800 కోట్లూ విడుదలయ్యేలా చేయండి. ప్రతి అక్కా, చెల్లెమ్మ మొఖాల్లో చిరునవ్వులు చూడాలంటే పావలా వడ్డీ రుణాలు అందివ్వాలని దివంగత మహానేత పావలా వడ్డీ రుణాలను తెచ్చారు. ఈ పథకానికి గతేడాదివెయ్యి కోట్ల బకాయిలున్నాయి. అదే పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. మొత్తానికి రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు ఇచ్చింది. ఇదే చంద్రబాబు.. ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి రూ. 2 వేల కోట్లు కావాలని అడగండి. లేకుంటే మరో వారం రోజుల గడువు తీసుకొని మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చెప్పండి. కానీ మీరలా ఎందుకు చెప్ప లేకపోతున్నారు? కారణం ఏమంటే చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారు.

మీ తప్పును కప్పిపుచ్చుకోడానికి..

శాసన సభలో మీకు 90 మంది శాసనసభ్యుల బలం ఉంది.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో వైపు వేలు చూపిస్తారా? ప్రతి పేదవాడి ఉసురు ఈ చంద్రబాబు నాయుడుకు, ఈ ప్రభుత్వానికి తగిలి ఆ అగ్నిజ్వాలల్లో మాడిపోతారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు, చంద్రబాబు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలకపక్షం నేతలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు.

మిగతా నేతలంతా దొంగ నోటులే
గరుగుబిల్లిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ ఒక పిట్టకథ చెప్పారు. ‘ఒక రైతు వంద రూపాయల నోటు తీసుకొని కూరగాయల కోసమని దుకాణానికి పోయాడు. కావల్సిన కూరగాయలు కొని తన చేతిలో ఉన్న వంద నోటును దుకాణం యజమానికి ఇచ్చారు. ఆ యజమాని నోటును చూసి ఇది దొంగ నోటని, దీన్ని నాకు అంటగడతావా అని రైతును అడిగాడు. మరి మంచినోటు ఎలా ఉంటుందీ అని అమాయక రైతు అడిగితే.. వైఎస్‌ఆర్‌లాగ నికార్సుగా ఉంటుంది, దొంగనోటు మిగిలిన నేతల్లా ఉంటుంది అని చెప్పాడు’ అంటూ కథను ముగిస్తుండగా.. జనం హర్షాతిరేకాలతో అభిమానం చాటుకున్నారు.

No comments:

Post a Comment