Pages

Tuesday, May 31, 2011

రైతు పక్షాన రాజీలేని పోరు

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసి వారికి అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి సమావేశం నిర్ణయించింది.
వివరాలు వెల్లడించిన కొణతాల, సోమయాజులు
క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితిలో ైరె తులుండటం బాధాకరం
ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం సాయాలకు దిక్కులేదు
దీనిపై సీఎంకు పార్టీ తరఫున లేఖ రాస్తాం
అసమర్థ సర్కారును
ఎవరు సాగనంపుతామన్నా మద్దతిస్తాం
తెలంగాణపై పార్టీ వైఖరిని ప్లీనరీలో ప్రకటిస్తాం
నెల రోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసి వారికి అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి తొలి సమావేశం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పాలక మండలి సమావేశమైంది. పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేక అల్లాడుతున్న రైతుల పరిస్థితిపై సమావేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలో ప్రధానంగా రైతుల సమస్యలపైనే చర్చించినట్లు పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. సహచర నేతలు డీఏ సోమయాజులు, జూపూడి ప్రభాకర్‌రావు, భూమా నాగిరెడ్డితో కలిసి సమావేశం వివరాలను కొణతాల మీడియాకు వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుందని, ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ విధానాలను పూర్తిగా వదిలి వేసిందని కొణతాల అన్నారు. వైఎస్‌కు వారసులమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆయనపై బురదజల్లడానికే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైఎస్ జీవించి ఉంటే అన్నదాతలకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రేషన్‌కార్డుకు 30 కిలోల బియ్యం అందజేసేవారని ఆయన స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై సీఎంకు లేఖ..

డీఏ సోమయాజులు మాట్లాడుతూ రైతు సమస్యలపై పార్టీ తరఫున సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక లేఖ రాస్తున్నామనీ, దానిని బుధవారం పత్రికలకు విడుదల చేస్తామని చెప్పారు. రైతులు వరి పండించకుండా క్రాప్ హాలిడేను ప్రకటించుకోవడం వారి దీనస్థితికి అద్దం పడుతోందని, ఇది చాలా విచారకరమని ఆయన అన్నారు. వైఎస్ మృతి చెందిన తరువాత 2009 సెప్టెంబర్ నెల నుంచి వరుసగా మూడు నాలుగు ప్రకృతి వైపరీత్యాలకు రైతులు విలవిల్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటికి సంబంధించి ప్రధాని ప్రకటించిన సాయంగానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీగానీ, రుణాల రీషెడ్యూలింగ్ కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదన్నారు. వెయ్యి కోట్లు ఇస్తానన్న ప్రధాని రూ.500 కోట్లు ఇచ్చి సరిపుచ్చారన్నారు. మరో రూ.500 కోట్లు కేంద్రానికి రాష్ట్రం ఇవ్వాల్సిన మొత్తం నుంచి మినహాయించుకోవాలని సూచించారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. రీషెడ్యూలింగైతే ఒకటీ అరా బ్యాంకుల్లో తప్ప ఎక్కడా జరగలేదన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తెస్తూ లేఖ రాస్తామని సోమయాజులు వివరించారు.

వైఎస్ పథకాలు నభూతో..

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎవ్వరూ ఆలోచన కూడా చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేశారని, ఆ పథకాల భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో పడిందని కొణతాల అన్నారు. ఆ పథకాలను సంపూర్ణంగా కొనసాగించే ఉద్దేశంతో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకోసం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు, దౌర్భాగ్య పరిస్థితికీ నిదర్శనమన్నారు. అధిక దిగుబడి వల్లే ధాన్యాన్ని కొనిపించలేకపోతున్నామని సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనటం ప్రభుత్వ తీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. ఈ ఏడాది 139 లక్షల టన్నుల ధాన్యాన్నే కొనిపించలేకపోయారని, అదే వైఎస్ ఉన్నపుడు 143 లక్షల టన్నులను ఏ ఇబ్బందీ లేకుండా సేకరించారని తెలిపారు. కేంద్రం వైఖరితో రైతులకు వచ్చే ఏడాది రుణాలు అందే అవకాశం కనిపించడంలేదని ఆవే దన వ్యక్తంచేశారు.

అవిశ్వాసానికి మద్దతిస్తాం

రైతన ్నల సమస్యలపై ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా తమ పార్టీ మద్దతిస్తుందని కొణతాల తెలిపారు. చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే తాము ఆహ్వానిస్తామని, తమ బలాన్ని ఆ సమయంలో చూపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడే ఏ పక్షంతోనైనా కలుస్తామన్నారు.జగన్ ఏనాడూ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పలేదని, ఏ వర్గానికీ న్యాయం చేయలేని ఈ సర్కారుకు కొనసాగే నైతిక హక్కులేదనే అన్నారని గుర్తుచేశారు. తండ్రి కోసం మరణించినవారిని పరామర్శించాల్సిన నైతిక బాధ్యత జగన్‌పై ఉందని, అందుకే ఆయన ఓదార్పుయాత్ర అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగిస్తారని వెల్లడించారు.

సభ్యత్వ మాసోత్సవం..

గ్రామ గ్రామానికీ, గడప గడపకూ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడతామని కొణతాల వివరించారు. సభ్యత్వం ఎప్పుడు ప్రారంభించేదీ బుధవారం జిల్లా అడ్‌హాక్ కన్వీనర్ల సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఆ తరువాత ఒక తేదీని ఇచ్చి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయని, వీటిలో పార్టీ అన్ని అంశాలపైనా తన విధానాలను విస్పష్టంగా ప్రకటిస్తుందన్నారు. వ్యవసాయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్య, యువజన, మహిళా విధానాలన్నింటిపైనా పార్టీ వైఖరిపై ముసాయిదాలు రూపొందిస్తామన్నారు. ఈ విధానాలు రూపొందించేటపుడు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. ఉదాహరణకు వ్యవసాయ విధానంపై డాక్టర్ స్వామినాథన్, జయతీఘోష్ లాంటి వారి సలహాలు తీసుకుంటామన్నారు. ప్రతి విధానానికీఒక సబ్జెక్ట్ కమిటీ ఉంటుందన్నారు. తెలంగాణపై కూడా ప్లీనరీలో తమ పార్టీ విధానం ఏమిటో ప్రకటిస్తామని కొణతాల స్పష్టం చేశారు.

No comments:

Post a Comment