Pages

Wednesday, June 1, 2011

నమ్మకంతో బాధ్యతలు అప్పగించా: జగన్

హైదరాబాద్ : ‘‘మీ అందరి మీద ఎంతో నమ్మకంతో మీకు బాధ్యతలు అప్పగించాను. కష్టపడి పని చేయండి.మీరు పార్టీ తరపున చేయల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పార్టీ బాధ్యతలు నిర్వర్తించలేమని భావిస్తే ఇపుడే చెప్పండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందాం. అంతే గానీ బాధ్యతలు స్వీకరించి పార్టీ పని చేయకుండా ఉండొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు విస్పష్టంగా తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కన్వీనర్లు, పరిశీలకులు, కేంద్ర పాలక మండలి సభ్యులను ఉద్దేశించి రెండో రోజు ప్రసంగిస్తూ ఎవరైనా పార్టీ చెప్పిన పనులు నిర్వహించలేమని భావిస్తే చేతులెత్తాలని కోరారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ఇపుడు చేస్తామని చెప్పి మధ్యలో మానుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, కనుక ముందే చెప్పాలని ఆయన కోరారు. పార్టీ నేతలను ప్రోత్సాహ పరుస్తూనే సభ్యత్వం, కమిటీల ఏర్పాటు వంటి విషయాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సున్నితంగా అన్నారు. అడ్‌హాక్ కన్వీనర్లకు పార్టీ వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉంటుందనీ అయితే అందరికీ ఆమోదయోగ్యంగా పనులు చేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందనీ జగన్ అన్నారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా అడ్‌హాక్ కమిటీల్లో ఉండాల్సిన సభ్యుల కనీస సంఖ్య 6 లేదా 7 మంది ఉండాలనీ, గరిష్ట సంఖ్య 10 మంది ఉండాలనీ ఆయన సూచించారు. ఈ కమిటీల్లో సాధ్యమైనంత వరకూ అన్ని వర్గాలూ ఉండేలా చూడాలని కూడా ఆయన కోరారు. సభ్యత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల మాదిరిగా బోగస్‌వి ఉండరాదని ఆయన హెచ్చరించారు. కచ్చితంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం చే ర్పించాలనీ సభ్యత్వ రుసుము వారి వద్ద నుంచే వసూలు చేసి వారి సంతకాలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలా కాకుండా నాయకులు మొత్తం డబ్బులు తామే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చెల్లిస్తామంటే అంగీకరించబోమనీ ఆయన అన్నారు. సభ్యత్వ రుసుము వారి వద్ద తీసుకున్నపుడే పార్టీలో ప్రజల భాగస్వామ్యం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. పార్టీ పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయనీ, వాటిని పార్టీ పటిష్టత కోసం మలుచుకోవాలని ఆయన పార్టీ నేతలతో అన్నారు.

తెలంగాణపై విస్పష్టమైన విధానం

తెలంగాణ విషయంలో పార్టీకి స్పష్టమైన వైఖరి ఉండాలని ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లా కన్వీనర్లు పి.జనక్ ప్రసాద్, కె.కె.మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి అధ్యక్షుడు జగన్‌కు సూచించారు. జనక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారనీ వారందరూ మన పట్ల సానుకూలంగా ఉన్నారనీ అన్నారు. వారి విశ్వాసం మరింతగా చూరగొనాలంటే తెలంగాణపై ఒక విధానం ప్రకటించడంతో పాటుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. అందుకు జగన్ స్పందిస్తూ కచ్చితంగా ఇడుపులపాయలో జరిగే ప్లీనరీలో వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment